Monday, January 23, 2012

అరుణాచల శివా!


పూర్వం బ్రహ్మా - విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అన్న వివాదం వచ్చినప్పుడు, పరమశివుడు మహా అగ్నిలింగంగా ఉద్భవించి వారిని పరీక్షించిన దివ్యస్థలం అరుణాచలం. అటువంటి అరుణాచలంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి.




 " స్వామీ! మేము అఙ్ఞానంలో పడిపోతున్నాం! మాయా మోహితులమై పుణ్యగతులు పొందలేకున్నాము. మోక్షమార్గమెరుగకున్నాము. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కలియుగంలో మానవులకు తగిన మార్గమేటి? సులభంగా మోక్షం పొందే విధము తెలుప వలసినది. "  అని ఋషులు ఒకానొక సమయంలో పరమేశ్వరుని ప్రార్థన చేశారట. అందుకు ఈశ్వరుడు ఈ విధంగా సెలవిచ్చారు.

దర్శనాత్ అభ్ర సదశీ జననాత్ కమలాలయే
కాశ్యాంతు మరణాన్ముక్తిః  స్మరణాత్ అరుణాచలే!

  
చిదంబరంలో ( ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా ) దర్శన మాత్రము చేత,  కమలాలయం ( తిరువాయూరు ) లో పుట్టుక చేత, కాశీలో మరణము చేత, అరుణాచల  స్మరణ మాత్రము చేత ముక్తి లభిస్తుంది.
                 



 
చిదంబరములో దర్శనము చేత : చిదంబరములో అసలు విగ్రహమే లేదు కదా మరి దర్శనమెలాగ!? అదే చిదంబర రహస్యం అన్నారు. అక్కడ ఉన్నది ఆకాశ లింగం. ఆకాశము అంతటానిండిఉన్నవాడు ఎవరున్నారో అతడే అక్కడ కొలువై ఉన్నాడు. అటువంటి ఈశ్వరుని దర్శనం అంటే మాటలు కాదు. ఎందరో మహపురుషులకు సైతం ఇది కష్టతరమైనది. కనుక ఇంకాసులువైన మార్గం చెప్పవలసింది అనివేడుకున్నారు.

కమలాలయంలో పుట్టుక చేత : పుట్టుక మన చేతులలో ఉండదు కదా! అది పూర్వకర్మ వలన మాత్రమే లభిస్తుంది. కనుక ఇది కూడా బహు కష్టమైనది. ఇంకా సులువైనది తెలుపవలసినది.

కాశీలో మరణము చేత : మరణము నకు కాశీ వెళ్లడానికి కూడా ఇల్లు, పిల్లలు అంటూ అనేక బంధాలు అడ్డుపడతాయి. ఇంతకంటే సులభమార్గమును సెలవివ్వవలసినది మహాదేవా!

అరుణాచల స్మరణ మాత్రము చేత : అయితే అరుణాచల స్మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదిస్తాను అన్నారు.


బిడ్డలమీద ఎంతటి ప్రేమ!? బోళాశంకరునడం అందుచేతకదూ! 






అరుణాచల శివ! అరుణాచల శివ! అరుణాచల శివా!

  బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసముల ఆధారంగా http://te.srichaganti.net/Pravachanams.aspx  మీరుకూడా వినండి.

Wednesday, January 18, 2012

దేవాలయ నిర్వహణా సమస్యలు - 2

వంద గుళ్లు కడతారు. ఒక అర్చకుని పెడతారు. నిజంగా పూజ చేసుకోవాలనుకునే అర్చకునికి ఒక గుళ్లో చెయ్యడానికి తక్కువలో తక్కువ ఉదయం తొమ్మిదింటి వరకు అర్చన, జపతపాలు సరిపోతాయి. మరి ఇతర దేవాలయాలలో ఎప్పుడు చేయాలి? ఈలోపు వచ్చే భక్తులను ఎవరు చూసుకోవాలి?  వచ్చే భక్తులు ఎక్కువగా ఉద్యోగాలకు వెళతారు కనుక ఉదయం తొమ్మిదిలోపే వస్తారు. మరి పూజకు సంకల్పం చేసుకున్న తరువాత ఎవరో భక్తుడు వస్తే వారికి హారతులు, తీర్థప్రసాదాలు ఇచ్చేది ఎవరు? సంకల్పించిన పూజ మధ్యలో ఆపి లేవాలా? అలా లేవకపోతే మేము వస్తే అర్చకస్వామి మమ్మల్ని అసలు పలకరించనుకూడా పలకరించలేదని ధర్మకర్తలకు కంప్లైంట్.

అర్చకునికి దక్షిణగా ఓ రెండు వేలు ఇస్తారు. అదే ఎక్కువ అనుకుంటారు. నిజానికి ఓ జీతగాడిని నియమించుకున్న భావనలో ఎక్కువమంది ధర్మకర్తలు ఉంటారు. జీతం ఇంత ఇస్తాం అంటారు గానీ, అయ్యా మీకు జీవన భృతిగా ఇంతమాత్రమే దక్షిణ ఇవ్వగలం అనే సంస్కారం ధర్మకర్తలలో కొరవడుతున్నది.  అటువంటి ధర్మకర్తలకు ఇక అర్చకుడు ఎటువంటి సూచనలు ఇవ్వగలడు? ఏమి పూజలు చెయ్యగలడు. పేరుకుమాత్రం గురువు, కార్య రూపంలో జీతగాడు గా అర్చకులు మిగిలి పోతున్నారు.


 ఒక ఇల్లు కూడా ఇవ్వరు, ఎక్కడో కర్మకాలి ఓ స్టోర్ రూమ్ వంటి గది ఇవ్వగలిగే వసతి ఉంటే ఇంకేంటి మీకు మహోపకారం చేసేస్తున్నామన్న భావన లో ఎక్కువమంది ఉంటున్నారు. ఒక్క గదిలో అసలు ఎలా ఉండగలరు? ఇంట్లో ఆడవాళ్లకు ఇబ్బంది రోజులలో ఎక్కడ ఉండాలి? ఒకవేళ అర్చకుడు వాళ్లిచ్చే గదిలో ఉండడానికి సిద్ధపడితే..., అర్చకుడు, అతని కుటుంబము దేవాలయానికి కాపలా దారులుగా ఉండవలసి వస్తుంది. దేవాలయ పాత్రల శుభ్రతకు ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రసాదాలు అవీ అర్చకుని భార్య వండి పెట్టాలి. అదేమంటే ధనంలేదు అంటారు. కానీ కొత్తగుడి ప్రారంభిస్తారు.  రెండు మూడు వేలలో ఇలా అన్ని సదుపాయాలు కలిసొచ్చే అర్చకుడు కావాలి చాలా మందికి. భోజనానికి ఎలా గడుస్తున్నది అనికాని, కుటుంబ పోషణ జరుగుతున్నదా అని కానీ అడుగరు. అంత తెలివి తక్కువ ప్రశ్న మరొకటి లేదని వారికి తెలిసు.

ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక దేవాలయానికి ఇద్దరు అర్చకులు కావాలి. ఒక ప్రధానా ర్చకులు, ఒక సహాయకులు.   అర్చకునికి మడి ఆచారానికి సరిపోయే ఇల్లు ఇవ్వాలనే అవగాహన ధర్మకర్తలకు ఉండాలి. జీతం కనీసం కుంటుంబ పోషణకు సరిపడా ఉండాలి. అర్చకుని కుటుంబం కాక, వాచ్ మెన్ కుటుంబం కూడా ఆ దేవాలయానికి దగ్గరలో ఉండాలి. దేవాలయ కాపలా, శుభ్రత మొదలైన వి వారు నిర్వహించాలి. ఎక్కువ ప్రసాదాలు వండ వలసి ఉంటే వంటవారిని పెట్టడం మంచిది.

దేవాలయ నిర్వహణా సమస్యలు

నేను చేస్తున్నాను అనే భావన తగ్గాలి : దేవాలయంలో దేవునికి రోజూ ఒక పూలమాల కూడా వేయలేని స్థితిలో ఉంటారు ధర్మ కర్తలు, కానీ గుడి మీద గుడి కడతారు. ఆలయ నిర్వహణకు ధనం ఉండదు. రోజూ దేవుడికి దేవాలయం తరపు న ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేని స్థితి. అఖడం అంటే నూనె చాలా ఖర్చవుతుందని దీపం పెట్టి వదిలి వేయమంటారు. పోనీ ఎవరైనా దాతలను వారు అడుగరు. దానికి అహం అడ్డు వస్తుంది. వారు ఎవరినీ అడగకుండానే ఎవరో రావాలి. ధనం కురిపించాలి. పోనీ ఎవరో వచ్చి ఇచ్చినా అది మరో దేవాలయ నిర్మాణానికి ఖర్చు పెడతారు. దర్శనానికి వచ్చేవారే రోజూ ఎవరూ ఉండరు. కానీ అర్చనకు, అభిషేకానికీ, హోమానికి చివరికి కొబ్బరకాయ కొట్టుకోడానికి కూడా టికెట్ పెడతారు.

    దేవాలయ నిర్వహకులకు ఉండవలసిన ప్రధాన అర్హత ధనం కలిగి ఉండడమా? ధర్మాచరణ కలిగి ఉండడమా? అని ప్రశ్నించుకుంటే ధర్మాచరణ కలిగి ఉండడమే అని చెప్పవచ్చు. వేద మార్గాన్ని నమ్మి ఆ ధర్మాన్ని ఆచరణలో చూపగలిగే శ్రద్ధ, భగవద్భక్తి ఉన్న ధర్మకర్త నిర్వహణలో ఉన్న దేవాలయాలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. కేవలం ధనం ఉండి, పేరుకోసం, డాబుకోసం దేవాలయాలను నిర్మించడం అనర్థదాయకమే అవుతుంది. రెండూ కలిగిన ధర్మకర్త అయితే ఇక ఆదేవాలయం నిత్యకళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లుతుంది అనడంలో సందేహంలేదు. భక్తి కలిగిన ధర్మకర్త తన శక్తి వంచనలేకుండా దేవాలయానికి తన వంతు ఆర్థిక సహయం చేయాలి. కానీ దేవాలయాలు నేటి రోజులలో ఒక్క వ్యక్తి సహాయంతో నడపలేము కనుక తన వద్ద ధనం చాలని పక్షంలో నలుగురి సహాయం అర్థించడానికి మొహమాట పడకూడదు. "నేను చేస్తున్నాను, నాకొసం చేస్తున్నాను అనుకున్నప్పుడు అహం అడ్డువస్తుంది. అదే భగవంతుడు నడిపిస్తున్నాడు, భగవత్కార్యం చేస్తున్నాను అనుకున్నప్పుడు అలా అడిగి మరీ కార్యం పూర్తిచెయ్యడంలో ఒక తృప్తిఉంటుంది." ఇది గుర్తెరిగి భగవత్కార్యానికి నలుగురి సహాయాన్ని తీసుకుని మరీ ముందుకు వెళ్లినప్పుడు దేవాలయ నిర్వహణ అనేది సుగమం అవుతుంది.