Saturday, January 26, 2013

పూజల పేరుతో ద్రవ్యాన్ని వృథా చేస్తున్నామా? - 2


మొదటి భాగం ఇక్కడ చదవండి


       మనం కొనుక్కునే బ్రాండెడ్ డ్రస్ ల ఖర్చు తగ్గించి లేనివారికి సహాయపడదామనే ఆలోచన మనకు రాదు. . పట్టు చీర పదివేలు పెట్టి కొని ఎన్నిసార్లు కడుతున్నారు చెప్పండిరెండు ఫంక్షన్ లకు వేసుకు వెళ్లగానే అది చాలా ఫొటోలలో వచ్చేసిందనో మరోటనో దానిమీదనుండి మనసు మళ్లుతుంది. మళ్లీ  వచ్చే పేరంటానికి వేరే చీరకావాలి.  
       ఇంటిలో విలాసాలను తగ్గించి నలుగురికి సేవచేద్దామనే ఆలోచనరాదు. టీవీ ఎవరు చూసినా చూడకపోయినా వాగుతూనే ఉండాలి.   ఒకళ్ళకి నచ్చిన ప్రోగ్రాం ఒకరికి నచ్చదు. కనుక బెడ్ రూమ్ లో ఒకటి హాలు లో ఒకటి . కంప్యూటర్ ఆన్ చేసి ఆఫ్ చెయ్యాలంటే బద్దకం. అందువలన అది ఆన్ లోనే ఉండాలి. నేను చాట్ చేసుకోడానికే సమయం సరిపోదు. ఇక చెల్లెలో అక్కో పోటీకివచ్చి కావాలంటె ఇవ్వలేను. అందుకే నాన్నకోడెస్క్ టాప్, అబ్బాయికో లాప్ టాప్, అమ్మాయికో టాబ్లెట్. మాట్లాడే ఫోన్ బిల్లు వేలు చేరుతున్నా పట్టించుకోం. ఆంగ్ల సంవత్సరాదికి ఇచ్చే పార్టీ అదిరిపోవాల్సిందే! సినిమా బ్లాక్ లోనైన సరే మొదటిరోజు మొదటి ఆట చూడాల్సిందే! 
     ఇక పెళ్ళిళ్లు, పేరంటాల పేరుతో తమదర్పాన్ని చాటుకోవడం కోసం పడే ఆరాటం ఖర్చు కోట్లు చేరుతుంది. ఈ పూట వండినది మరొ పూట వండకుండా పూటకో వందరకాల వంటకాలు. అందరూ డైటింగ్ పేరుతో వాసను చూసి వెళ్లే వాళ్లే. ముట్టుకునే వాడు ఉండడు. మిగిలినవన్నీ మురిక్కాలవలో పోస్తారు రెండో రోజు.  ఇలా చెప్పుకుంటూ పోతే నిత్య జీవనంలోనే వృథా చేసే సందర్భాలు కోకొల్లలు. వీటిలో ఏఒక్క సందర్భంలోనూ అయ్యో వృథాచేస్తున్నామే అన్న ఆలోచనరాదు. అవన్నీ ఆలోచిస్తూకూర్చుంటే కార్యక్రమం ఆస్వాదించలేం మరి. 
     కానీ భగవంతునికి కాసిని పాలు పొయ్యాలనే టప్పటికి మాత్రం అయ్యో ఇవన్నీ అనవసరంగా వృథా అయిపోతున్నాయేమో అనే ఆలోచన పెరిగిపోతుంది. నిజంగా సంఘ సేవలో మునిగి తేలుతున్నవారికి రాదు ఈ అనుమానం. ఎందుకంటె వారికి తెలుసు పరులకు సహాయపడినప్పుడు కలిగే ఆనందానికి, భగవదారాదనలో కలిగే ఆనందానికీ తేడాలేదని. ఇటు పూజలు చేయిస్తున్నవారికీ కలుగదు ఈ అనుమానం. ఎందుకంటే దేనికి ఎంత ఎప్పుడు ఎలా కేటాయించాలొ వారికి తెలుసుకనుక. ఇటువంటి అనుమానాలన్నీ ప్రక్కన నుంచుని చూడడానికి వచ్చే వారికే! ఏదేవాలయానికో వెళతాం. అక్కడ అభిషేకం జరుగుతూ ఉంటుంది.  పాలతో స్వామికి అభిషేకిస్తూ ఉంటారు.  మనసు నిల్పి ఆస్వాదించ గలిగితే నిజానికి అది ఓ అద్భుతఘట్టం. మనసు నిలుస్తుందా!? అలా సజావుగా సాగనిస్తే  దానిని కోతితో ఎందుకు పోలుస్తారు? ఏవేవో ఆలోచనలు రేకెత్తిస్తుంది. అరెరే ఇన్ని పాలు వృథాగా నేలపాలవుతున్నాయే! ఏ కాసిని పాలు పోసి మిగతావి మిగతావి పేదలకు పంచితే వారి కడుపు నిండుతుంది కదా?” అని.



రోజూ అభిషేకం చేస్తున్నా మీరు కేటాయించే పాలు ఎన్ని. మహా అయితే రోజుకు ఒకలీటరు. కానీ ఇక్కడ వచ్చే అనుమానమేమంటే " ఒక లీటరు అయితే ఫర్వాలేదు. కానీ లీటర్లు లీటర్లు పాలు అలా వృథా అయిపోతున్నాయి " అని. మీ ఇంటిలో అభిషేకం చేస్తే ఒక లీటరు. అదే పదిమంది కలిసి ఒక ఆలయంలో చేస్తే పది లీటర్లు. వంద మంది చేరితే వందలీటర్లు. మీరు చూసేది ఒకే దేవాలయంలోని దేమునికి ఒకే రోజు వందలీటర్ల పాలు పోయడం.  ఒక వ్యక్తి హోమం చేస్తే ఒక లీటరు నెయ్యి ఖర్చు అవ్వవచ్చు. అదే వందమంది చేస్తె వంద లీటర్లు అవుతుంది. . దేవాలయాలు శక్తికేంద్రాలు. ఒక దేవాలయంలో జరిగే వైదిక క్రతువులను బట్టి, ఆచార వ్యవహారాలను బట్టి ఆదేవాలయంలోని శక్తి రోజురోజుకీ పెరుగుతూ ఉంటుంది. ఆశక్తి ముందుగా చుట్టుప్రక్కల ప్రాంతాలను, శక్తి పెరిగే కొద్దీ ఆనగరాన్ని, రాజ్యాన్నీ రక్షణ నీయగలిగే స్థితిని పొందుతుంది. కనుక  శక్తి ప్రసారం చేయడంలో అంతటి ఆవశ్యకత కలిగిన దేవాలయాలలో ఎంత ద్రవ్యాన్ని వినియోగించినా ఇంకా తక్కువే అవుతుంది.  భగవంతునికి భక్తితో సమర్పించే ప్రతి ద్రవ్యం సద్వినియోగం అవుతున్నది అని కొందరు అనుకుంటున్నారు.  వృథా అవుతున్నది  కొందరు అనుకుంటున్నారు.


ఇక్కడ వచ్చే మరో ప్రశ్న ఏమిటంటే భగవంతునికి భక్తితో సమర్పించే నీటి చుక్కకూడా ఫలితాన్ని ఇస్తున్నది అంటారు కదా! మరి ఈ పాలు, కొబ్బరికాయలు మొదలైనవన్నీ ఎందుకు? అని...

   ఒక సారి ఆలోచించండి. మనం ఏమితిన్నా ఆకలితీరుతుంది కదా. అలాంటప్పుడు ఈరోజు పప్పు, రేపు కూర, మరో రోజు వేపుడు ఎందుకు? ఉత్తి అన్నం ఉడికించుకు తింటే చాలదా? మనకడుపు చల్లబడడానికే ఇన్ని రకాలు కావల్సి ఉంటి లోకాలన్నీ చల్లబడాలని చేసే క్రతువులుక ఎన్ని ఇస్తే మాత్రం సరిపోతుంది చెప్పండి? అంతెందుకు... మనం బస్టాండ్ లో నుంచుని ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలేస్తోంది సారి ఏమైనాఇవ్వండి అంటాడు.మనకు డబ్బులు ఇవ్వడం కన్నా తినేది ఏమైనా ఇవ్వాలనిపిస్తుంది అనుకోండి. ప్రక్కనే ఉన్న హొటలు కు తీసుకు వెళతాం. అక్కడ ఇడ్లి, వడ, దోశ, ఉప్మా, భోజనం ఏదైనా ఇరవై రూపాయలే అనుకోండి అప్పుడు మనకిష్టమొచ్చింది ఇప్పిస్తామాలేక అతని ఇష్టమేంటో కనుక్కుంటామా? ఏది పెట్టినా అతని ఆకలి తీరుతుంది. కానీ నీకేంకావాలొ తీసుకోవోయ్ అంటాం. మరి ఒక బిచ్చగాడికి అన్నం పెడితేనే అంత ఉదారంగా వ్యవహరించే మనం, సర్వేశ్వరుని సేవచేసే అవకాశం వస్తే పాలుపొయ్యాలా? నీళ్లుపొయ్యాలా? అని ఆలోచిస్తామా!? ఎలా చేస్తే అతనికి ప్రీతికలుగుతుందని చెప్తారో అలానే చేస్తాం? అలానే కొందరు తమ కష్టాలు తీర్చుకోవాలని పూజలుచేస్తుంటారు. ఇలా కోరికలు కల వారు కొన్ని ప్రత్యేక వస్తువులతో స్వామిని సేవించవలసి ఉంటుంది.   
 నేడు కలిమాయ వలన ఆయా సందర్భాలలో చాలా  పదార్థాలను వృధా చెస్తున్నామనే చెప్పాలి.  కానీ పూజలకై ఖర్చు చేసే ద్రవ్యాన్ని మాత్రమే వృథా అని వాపోవడం కలి ప్రభావమే!
భక్తితో చేసే పూజమాత్రమే సత్ఫలితాన్నిస్తుంది. ఆడంబరంకోసం చేసే దయితే ఒక లీటరైనా, వెయ్యి లీటర్లైనా అది వినాశనాన్నే కలుగ జేస్తుంది. ఒక వేళ మీపూజలో శ్రద్ధకనుక ఉండి భగవంతుని ప్రీతికొరకు, నామనసారా స్వామిని సేవిస్తాను అని తలచి పూజిస్తే వెయ్యిలీటర్లతో చేసినా( ఒక వ్యక్తి అంత ద్రవ్యం వాడడం సరికాదు. తాను పెంచే లేదా తన అధీనంలో పెంచే ఆవు తన బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను అభిషేకిస్తే చాలు. ఒకవేళ అతనికి ఓ వంద ఆవులు ఉండి వచ్చిన పాలన్నీ అభిషేకానికి వినియోగిద్దాము అనుకుంటే ) అది తప్పుకాదు. అది స్వామి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.  అభిషేకానంతరం ఆప్రసాదం పేదవారికి పంచడం చాలా మంచి పద్ధతి. కానీ అలాకాక తీర్థం నేలమీద పారడం వలన ఆతీర్థం వృథా అయినట్లుభావించడం సబబుకాదు. అదికూడా సద్వినియోగ పడినట్లే!





కేవలం మన పొట్టకూటికోసమో, మరోదానికో వినియోగించిన ద్రవ్యం మాత్రమే సద్వినియోగమైనట్లు భావిచడం సరికాదు. భగవంతునికి అర్పించే ఏ ద్రవ్యమూ వృథాకాదు. భగవన్నిర్మాల్యం ప్రకృతిలో కలవడం ద్వారా అందరికీ అన్ని పూటలా కావాల్సిన ఆహారం దొరుకుతోంది. భగీరథుని కోరిక మేరకు శివుని శరీరాన్ని అభిషేకించిన గంగమ్మ త్రిపథగగా మారి సగరులకు తర్పణాలివ్వడానికి పనికి వచ్చినప్పటికీ పెద్ద నదిగా మారి ఇప్పటికీ ఎందుకు భూమి మీద పారుతున్నది? ఆకాశంలో ఉండవలసిన గంగ, దేవతల అవసరాలకు వాడవలసి వచ్చే గంగా జలం భూమిమీద ఉండడం వ్యర్థం ఎలాకాదో ఇదీ అంతే. అభిషేక జలం నేల మీద పడి చుట్టూ ఉండే భూమిని పవిత్రంచేస్తుంది. ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ ఆధ్యాత్మిక తరంగాలతో ప్రభావితం చేస్తుంది. ఈ ద్రవ్యాలు పరమాత్మ శరీరాన్ని తగిలి వచ్చినవి అతి శక్తి వంతమైనవి. అవి ఆనేలలో ఇంకడం వల్ల ఆ ప్రదేశంలో శక్తి తరంగాలు పెరుగుతూ ఉంటాయి. ఇది వ్యర్థం అన్న మాటే లేదు. వ్యర్థం అన్నది ఇక్కడ అన్వయమూ అవ్వదు. ఒక మనిషికో మరోదానికి ఇస్తే వ్యర్థం అయ్యిందనుక్కోవచ్చేమోకానీ, పరమాత్మకి సమర్పించేసాక వ్యర్థమన్న మాటకి తావేది? పరమాత్మకి సమర్పించినది ప్రకృతిలో కలుస్తున్నది. దాని వల్ల ప్రకృతి పరవశించి చల్లగా చూస్తున్నది, పంటలిస్తున్నది... వ్యర్థమౌతున్నదేమో అన్న భావన వదిలి చక్కగా అభిషేకాదులలో పాల్గొని ఆధ్యాత్మికోన్నతిని, భగవదనుగ్రహాన్ని పెంపొందించుకొనగలరు.

చండీశ్వరుడు

ఒక శివభక్తుడు తన తండ్రి దగ్గరే వేదం చదువుకుంటూ ఉండేవాడు. ఒకనాడు గోవుని గోపాలకుడు కొట్టడంచూసి "ఎందుకు కొడుతున్నావు?" అని అడిగితే ఐతే నువ్వే వీటినిసాకు అని చెప్తే అలాగే చేస్తాను అని అతడే ఆగోవులను సాకసాగాడు. ఆ పిల్లవాని ఆధీనంలో ఉన్న గోపాలకులగోవులు అత్యధిక పాలు ఇవ్వడంవల్ల గ్రామంలో అందరికీ పాలు సమృద్ధిగా దొరికేవి. కారణం ఆ పిల్లవాడు గో క్షీరంతో సైకత లింగానికి రుద్రం చెప్తూ అభిషేకం చేసేవాడు. అది చూసిన ఇతరులు ఆ పిల్లవాడు పాలు పాడు చేస్తున్నాడనీ, అవి కూడా ఉంటేఇంకా సమృద్ధి కలుగుతుందనీ ఆ పిల్లవాని తండ్రికి చెప్పారు. అది నిర్ధారించుకుందామని ఆ పిల్లవాని తండ్రి ఒక చోట దాగి తనకొడుకేంచేస్తున్నాడో వేచి చూస్తున్నాడు. ఇది తెలియని పిల్లవాడు తన మానాన తాను ఒక సైకత లింగాన్ని నిర్మించి రుద్రం చెప్తూ గోవులని పిలచి గో క్షీరం తీసుకొని అభిషేకం చేయడం, ఒక గోవు తరవాత ఒక గోవు ఇలా కడవలకి కడవలుఅభిషేకం జరగడం అతని తండ్రి చూసి ఆగ్రహోదగ్రుడై ఆవు పాలు నేల పాలు చేస్తున్నావా అని ఆ పిల్లవాడిని వెనకనుంచి కొడితే అంతర్ముఖత్వంతోఅభిషేకం చేస్తున్న అతను కదలలేదు..... కాదు కాదుఆయనకి కొట్టిన దెబ్బ తెలియలేదు. కొట్టినా లేవకుండా ఆ పాలు మట్టిలో పోస్తున్నావా అని గదమాయించి కాలితో సైకత శివలింగాన్ని భగ్నం చేసాడు. వేద విదుడైనా ఆయన దృష్టిలో అది నేలమీద పోస్తున్న పాలు మాత్రమే, మనసు లగ్నం చేసి శివునికేఅభిషేకం చేస్తున్నాని తలుస్తూ మనసులో శివునికేఅభిషేకం చేస్తూ ఉన్న ఆ పిల్లవాడు శివలింగం భగ్నమవడంతో కళ్ళు తెరచి కోపాన్ని పొంది, ఎదురుగా కోపంతో ఊగుతున్న తన తండ్రిని చూసి, శివలింగం భగ్నానికి కారణమైనకాలుండరాదని పక్కన గోవులు కాయడంకోసం రక్షణగా తెచ్చుకున్న గొడ్డలి కనపడితే దాన్ని తన తండ్రి కాలిమీదకు విసిరాడు. అంత ఆ కాలు నరకబడి అందులోంచి రక్తం ఏరులా ప్రవహించి ఆ పిల్లవాని తండ్రి మరణించాడు. దానికి చలించిపోయిన శివుడు, ఏమిరా తండ్రీ నాకోసం కన్న తండ్రినే శిక్షించినవాడివని మెచ్చుకొని, నీకుతండ్రిలేడనే బాధలేదు నేనే నీకు తండ్రిని అని తన కుటుంబంలో ఒకడిగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామితో సమానంగా తన కొడుకుగా తన కుటుంబంలోస్థానమిచ్చాడు. అప్పట్నుంచి నలుగురుగా ఉన్న శివ కుటుంబం ఐదుగురైంది. ఆ పిల్లవాణ్ణి తన కుటుబ సభ్యునిగా స్థానమిచ్చి తన నిర్మాల్యానికి అధికారిగా నియమించాడు. ఇంకోవిధంగా చెప్పాలంటే దానికి అధికారిణి ఐన అమ్మవారు భార్యగా తనకున్న అదృష్టాన్నీ, అధికారాన్నీ తన మూడవ కొడుకైన ఆ పిల్లవానికి ఇచ్చింది. ఆయనే చండీశ్వరుడు. ఎప్పుడూ శివుని పక్కన ఉత్తర దిక్కు గా కూర్చొని ధ్యానంచేస్తూ ఉంటారు. ప్రకటంగా ఆ మూర్తి శివాలయాలలో ఉన్నా లేకున్నా శివలింగం ఉంది అంటే ఆయన అక్కడే ఉంటారు. శివ నిర్మాల్యం ప్రసాదంలాగా కానీ , అభిషేక తీర్థంకానీ తీసుకోవాలంటే చండీశ్వరులవారి అనుమతిలేనిదే కుదరదు. ఆయన అనుమతి అపేక్షించకుండా తీసుకుంటే శివాజ్ఞకి వ్యతిరిక్తంగా ప్రవర్తించినట్టు అవుతుంది. ఇది శివపురాణం, శైవాగమం ప్రకారం కూడా ఆలయంలో చండీశ్వర స్థానం ఉంటుంది.మన ఇంట్లో రుద్రాభిషేకం చేసుకున్నా, లేదా నిత్యార్చన చేస్తున్నానిర్మాల్యాన్ని ఉత్తర చండీశ్వరునికి చూపిస్తున్నట్లు ఉత్తరానికి చూపించి నిర్మాల్యాన్ని కళ్ళకద్దుకుని తీయడం పద్ధతిగా వస్తున్నది. 


  కేవలం మన పొట్టకూటికోసమో, మరోదానికో వినియోగించిన ద్రవ్యం మాత్రమేసద్వినియోగమైనట్లు భావిచడం సరికాదు. భగవంతునికి అర్పించే ఏ ద్రవ్యమూ వృథాకాదు. భగవన్నిర్మాల్యం ప్రకృతిలో కలవడం ద్వారా అందరికీ అన్ని పూటలా కావాల్సిన ఆహారం దొరుకుతోంది. భగీరథుని కోరిక మేరకు శివుని శరీరాన్ని అభిషేకించిన గంగమ్మ త్రిపథగగా మారి సగరులకు తర్పణాలివ్వడానికి పనికి వచ్చినప్పటికీ పెద్ద నదిగా మారి ఇప్పటికీ ఎందుకు భూమి మీద పారుతున్నది? ఆకాశంలో ఉండవలసిన గంగ, దేవతల అవసరాలకు వాడవలసి వచ్చే గంగా జలం భూమిమీద ఉండడం వ్యర్థం ఎలాకాదో ఇదీ అంతే. అభిషేక జలం నేల మీద పడి చుట్టూ ఉండే భూమిని పవిత్రంచేస్తుంది. ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ ఆధ్యాత్మిక తరంగాలతో ప్రభావితం చేస్తుంది.  

శ్రీ నాగేంద్రగారి సహకారంతో....