అయ్యా “నీళ్లలో నిప్పు ఉన్నది” అసలు నీరే నిప్పుగా ఉన్నది ( ఆపోవా అగ్నేరాయతనం... ) మాకు వేదంలో ఉన్నది అని ఎవరైనా వేదపండితులు చెప్పారనుకోండి, ఎవరూ నమ్మరు. నీళ్లలో నిప్పు వేస్తే ఆరిపోతుంది. అలాంటిది నీళ్లలో నిప్పు ఉండడమేమిటి? ఈయన ఎంత అమాయకుడో? ఇంకా ఇటువంటి ఉపన్యాసాలు చెప్పి జనాలను నమ్మించాలని చూస్తున్నారు అని మనసులోనేనవ్వుకుంటారు. ఎందుకంటే చాలామందికి తెలిసి నీళ్ళలో నిప్పు అనేది దాక్కొని ఉండడం అసంభవం. తమ నమ్మకం తప్పని అంత త్వరగా ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధపడి లేరు.
అదే ఓ సైంటిస్టు అయ్యా “నీళ్లలో నిప్పు ఉన్నది” అని చెప్పాడనుకోండి, ఆశ్చర్య పోతారు. అయినా పూర్తిగా నమ్మరు. ఏది ఎలాగ నిరూపణ చేయండి అంటారు. ఆయన చెప్తారు. “ నీటిని చేతితో తాకగలం, కంటితో చూడగలం. కానీ నీటిలో ఉండే నిప్పును తాకలేం, నేరుగా కంటితో చూడలేం. ఎందుకంటే దాని శక్తి అమోఘం. తాకితే మనం కూడా కాలిభస్మమై పోతాం. ఒక వస్తువుగుండా ప్రవహింప చేసినట్లేతే కనుక దానిని అనేక పనులకు సాధనంగా ఉపయోగించవచ్చు. దీపంగా వాడుకోగలం, ఆ వెలుగును చూడగలం. భూమిలో నుండి నీటిని తోడగలం. అనేక పనులు చేయగలం. ఆ నీటిలో నుండి వెలికి వచ్చిన నిప్పునే మనం “విద్యుత్” అని పిలుచుకుంటున్నాం...”
ఇదంతా విని అవునవును నిజమే నీటిలో విద్యుత్ చ్ఛక్తి ఉంది. దానిని మనం వాడుకుంటున్నాం కదా!? అంటూ ఒప్పుకుంటారు.
ఒక వేదపండితుడు చెప్పిన విషయాన్ని నమ్మడానికి ఇష్టపడని మనం ఒక సైంటిష్టు చెప్పగా నమ్ముతున్నాం. కారణం చాలా సమయాలలో మనం బుద్ధిని ఉపయోగించకపోవడమే! వేదపండితుడు - సైంటిష్టు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. కానీ వేదం అనగానే నేటి ఆధునికుల దృష్టిలో పెద్ద బూటకం. అది పాతచింతకాయ పచ్చడి వంటిది. ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. వేదం అంటే పూర్వకాలంలో కాలక్షేపానికి రాసుకున్న ఒక జీవన పద్ధతి. ఆరోజులలో ప్రజలు బావిలో కప్పలు. వారికి ప్రపంచం తెలియదు. తమ చిన్న ప్రపంచంలో జీవించడానికి పెద్ద పనేమీ ఉండేది కాదు. అందుకే ఖాళీ ఎక్కువై రాసుకున్న గ్రంథాలు అవన్నీ. ఈ రోజులకు సరిపోవు. అయినా నిరూపణకు సరిపోని అంశాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక అవి అన్నీ అసమంజసమైనవే. వాదనలకు నిలువలేవు – అని నేడు చాలామంది ఆధునికులయొక్క అభిప్రాయం
చాలామంది గొర్రెలవలెనే ఆలోచించడానికి అలవాటుపడి నేటికీ అదే విధానంలో ఉన్నారు. ఒక గొర్రె ఎటువెళితే వెనకాల గొర్రెలన్నీ అటే వెళతాయి. అలాగే నేటి కాలంలో పాప్ సాంగ్స్, ఫేస్ బుక్, వాట్సప్, సినిమాలు, డబ్బు మొ. వాటిలో కొట్టుకు పోతున్నారే కానీ మనమెటు వెళుతున్నాం అన్నది ఆలోచించడంలేదు. నూటికి ఎవరో ఒక్కరు మాత్రమే మనిషిలా తమ బుద్ధిని ఉపయోగించగలరు. వారే నాయకులవుతున్నారు. మిగతావారు గొర్రెల వలె లోకాన్ని అనుసరిస్తున్నారు.
కంటితో చూసినవి మాత్రమే నమ్ముతామంటే కారెట్ తింటే ఏ-విటమిన్ వస్తుంది అని డాక్టరు చెప్పినప్పుడు మీరు నమ్మకూడదు. కానీ నమ్ముతున్నారే! విద్యుత్ ను కంటితో చూడలేదు, చేతితో స్పర్శించ లేదు. కానీ విద్యుత్ అనేది ఉంది అని నమ్ముతున్నాము. విద్యుత్తు వలెనే భగవంతుడిని కూడా కంటితో చూడలేం, చేతితో స్పర్శించలేము. ఎందుకంటే ఆయనను భరించ గలిగే శక్తి ఈ శరీరానికి లేదు. విద్యుత్ తగిలితే శరీరం ఎలా తట్టుకో లేదో అలాగే భగవంతుని స్పర్శనీ ఈ శరీరం తట్టుకోలేదు.
ఒక పరిమితికి లోబడిన వస్తువులను మాత్రమే మనం కంటితో చూడగలం. ఆ పరిమితికంటే తక్కువ ఉన్నా(అణువు), ఎక్కువ ఉన్నా (సూర్యుడు) మనం కంటితో చూడలేం. అలా చూడడానికి మనకి భూతద్దం వంటి ఓ సాధనం కావాలి. ఆలాగే పరిమితికి లోబడిన శబ్దాలను మాత్రెమే మనం చెవులతో వినగలం. శబ్దం ఎక్కువ ఉన్నా వినలేం( చెవుడు వస్తుంది ), శబ్దం తక్కువ ఉన్నా మనకు వినబడదు. అంటే మనం చూడడానికి, వినడానికి, ముట్టుకోవాడనికి, వాసన చూడడానికి రుచి చూడడానికి వీటన్నిటికీ పరిమితులు ( Limitations ) ఉన్నాయి. పాంచభౌతికమైన మన శరీరమే పరిమితమైనది అయినప్పుడు అపరిమిత శక్తి కలిగిన భగవంతుని మనం ఈశరీరంతో ఎలా చూడగలం, ఎలా మాట్లాడగలం? అలా చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది.
" భగవంతుడనే వాడు ఉన్నాడు. ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి ఆర్తితో తండ్రీ రక్షించు అని పిలిస్తే నడి సముద్రంలో కూడా చేయందించి కాపాడుతాడు"
--------------------------------- రాజశేఖరుని విజయ్ శర్మ