Saturday, February 19, 2011

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు?

    రాముడు శత్రు సంహరం మొదలుపెట్టినదే తాటకతో. అలా అబలను చంపుట అదేమి న్యాయము? రావణుని చూసి సీత ఆమెలా( - ) ఎందుకు నవ్వింది? సీతాదేవి బంగరు లేడిని ఎందుకు కోరింది?రాజ్య భోగాలు వదిలి వచ్చిన సీతకి బంగారం మీద మోజా ? రాముడు వాలి నెందుకు చెట్టు చాటు నుండి వధించాడు? సీతని అగ్ని పరీక్ష ఎందుకు చేశాడు? సీతపై రామునికి నమ్మకము లేదా? పతి వ్రత అయిన సీత తన తపో శక్తి తో రావణుని ఎందుకు చంపలేదు? ఓ చాకలి మాటలు పట్టుకుని మళ్లీ సీతని అడవుల పాలు చేయడం రాముని తప్పు కాదా?..............  ఇలా రామాయణం చుట్టూ అనేక ప్రశ్నలు. కొన్ని అవసరమైనవి,  కొన్ని అనవసరమైనవి, తలా తోక లేనివి.  

రామాయణమునే ఎక్కువగా ఎందుకు విమర్శిస్తుంటారు ఈ ఆస్తికనాస్తికులు? ఎందుకంటే రామాయణం ఉత్తమ గ్రంధం కనుక. అటువంటి కావ్యం ఇతః పూర్వం కానీ, ఇతః పరం కానీ లేదు కనుక. అది వారు కూడా ఒక విధంగా ఒప్పుకోలేక ఒప్పు కుంటున్నారు కనుక. దానికి కలిగిన ఆదరణ మరే రచనకు లేదు కనుక.

అంత ఆదరణ కలగడానికి రామాయణంలో ఏముంది? రామాయణం లో ఏముంది? అనికాదు, ఏది లేదు? అని ప్రశ్నించుకోవాలి మనం. రామాయణ ప్రారంభంలోనే తాను రచిస్తున్నది మామూలు కావ్యం కాదని, అది ఒక ఆదర్శ పురుషుని కథ అని - అనేకులకు ఇది మార్గ దర్శకమౌతుందని చెప్పకనే చెపుతారు మహర్షి వాల్మీకి.


తన ఆశ్రమానికి వచ్చిన నారదుని వాల్మీకి మహర్షి ఈ విధంగా ప్రశ్నిస్తాడు.

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మఙ్ఞశ్చ కృతఙ్ఞశ్చ సత్య వాక్యో దృఢవ్రతః | |

సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్తులకు చలించని వాడు, సామాన్య- విశేష ధర్మములనన్నిటినీ ఎఱిగిన వాడు, శరణాగత వత్సలుడు, ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడి తప్పనివాడును, చలించని సంకల్పము కలవాడు అయిన పురుషుడు ఈ లోకమున ఎవడు కలడు? 
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కస్సమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః | |

సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకును హితమును చేకూర్చు వాడు, సకల శాస్త్రా కుశలుడు, సర్వకార్య దురంధరుడు, తన దర్శనముచే ఎల్లరకునూ సంతోషమును కూర్చువాడు ఎవరు?

ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే | |

థైర్యశాలియు క్రోధమును (అరిషడ్వర్గమును) జయించినవాడును, శొభలతో విలసిల్లువాడును, ఎవ్వరిపైనను అసూయ లేనివాడును, రణరంగమున కుపితుడైనచో, దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు?

ఇటువంటి లక్షణాలు కల మహాపురుషుడు అసలు ఎవరైనా ఈ భూమండలమున నేటి కాలములో ఉన్నాడా? ఉంటే అతని దివ్య చరితమును తెలుసుకోవాలని నాకు కుతూహలముగా ఉన్నది.

అందుకు నారదుడు  పైగుణములన్నిటికి తగిన వానిగా ఇక్ష్వాకు వంశ ప్రభువైన  శ్రీరాముని తెలుపుతాడు.
ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తరపురుషుడైన శ్రీరాముడు అందవతరించి, ఎంతయు జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిఱునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్యసంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు (చెక్కిలి పైభాగములు) గలవాడు, విశాలమైన వక్షఃస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియెముకలుగలవాడు, అంతశ్శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్థచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు......... ఇలా రాముడు సర్వగుణ సంపన్నుడని  తెలిపి అతని దివ్య కధను వాల్మీకి కి వివరిస్తాడు. 

పై గుణములన్నీ కేవలము ఒక కథలోని పాత్రకు కల్పించిన గుణములే అనుకుందాము. రామాయణము కేవలము ఒక ( చరిత్ర అని గాక ) కథ  అనుకుందాము. ఈ గుణములన్నీ కథా ప్రారంభముననే ప్రస్థావించ బడ్డాయి అంటే ఇంతటి గుణములు కల నాయకుని ఈ కావ్యము ద్వారా పరిచయం చేస్తున్నాను అని వాల్మీకి తెలుపకనే తెలుపుతున్నట్టే కదా!

అందులో ఓ భార్యా భర్తల అనురాగం ఉంది. భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి ఉండవలసిన అవగాహన అద్భుతంగా చిత్రించ బడింది. ఓ తండ్రి ని ఉత్తమంగా గౌరవించిన కొడుకు కథ ఉంది. ఓ స్వామి భక్తి పరాయణుడైన హనుమ కథ ఉంది. అగ్నిని కూడా భరించ గల ఓ సాధ్వి చరిత ఉంది. ఓ స్నేహ బధం( రామ సుగ్రీవులు) ఉంది.  పిత్రు వాక్య పరిపాలకుడుగా, శిష్యుడిగా, సోదరుడిగా, భర్తగా, జగద్రక్షకుడైన రాజుగా రాముని దివ్యగుణముల కీర్తనము అణువణువునా ఉంది. ఆఖరికి రామణుని వంటి వారికి కలిగే గతీ వివరించ బడింది.ఇది ఒక చరిత్ర కాక కేవలం ఒక కావ్యం మాత్రమే అనుకుంటే ధర్మ పాలనలో రాముడు, భర్తను అనుసరించడంలొ సీత, సోదర ప్రేమలో లక్ష్మణ - భరతులు, స్వామి భక్తిలో హనుమంతుడు,  అధర్మ పరుడైన రావణుడు, బ్రహ్మర్షి వశిష్ఠుడు, రాజ పదవినుండి బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్రుడు.... ఇలా అనేక పాత్రల చిత్రణ అద్భుతంగా రచియింప బడినది. రామాయణంలో ఈ పైపాత్రలన్నీ ఆయా గుణములలో అత్యున్నతమైనవి. తరువాత ఏ కావ్యములోనూ ఆయాగుణములలో అంత కంటే  ఉదాత్త పాత్రలను సృష్టించ లేక పోయారు.అటువంటి పాత్రలను పరిచయం చేసిన వాల్మీకి రచనా పాఠవం తరతరాలు అతనిని మరువకుండా చేసింది. ఇంతటి ఉత్తమ గుణములు కలిగిన వ్యక్తులు ఒక చోట, ఒకే కాలములో ఉన్నారు అన్న ఊహే ఎంతో ఆనందంగా ఉంటుంది.   మరి కథగా చూస్తేనే ఇంతటి పరవశమైతే ఇక అది నిజంగా మన భరత భూమిమీద జరిగిన చరిత్ర అంటేనో! అందుకే మన భారతీయలుకు రామాయణం అంటే అంత ప్రేమ. పరవశం, మమేకత్వం.

మరి ఇంతటి కీర్తి కలిగిన రామాయణానికి ఇన్ని విమర్శలెందుకు వస్తున్నాయి?

ఫలభరితమైన చెట్టుకు దెబ్బలు తగలడం అనేది లోక సహజమే కదా!? హిందూ ప్రజలందరికీ పూజనీయమైన ఈ రచనలో, అందులోని పాత్రలలో ఉన్న నీతిని గ్రహించడం మాని దానిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు కొందరు వ్యక్తులు. దానికి అనేక కారణములు ఉన్నవి.


రామాయణమును గురించి సరైన అవగాహన లేక : మనకు అనేక రామాయణములు వచ్చినవి. వాటిలో రమణీయమైన వర్ణన ఉండవచ్చునేమో కానీ అసలైన వాల్మీకి రామాయణమును తప్పుదోవ పట్టించినారు. దురదృష్ట వశాత్తు కలి ప్రభావమున ఈ నవీన రామాయణ ములే పరిచయము కానీ, వాల్మీకి రామాయణము గురించి సరైన అవగాహన ప్రజలకు లేదు.  పైగా పాఠ్య పుస్తకాలలో కూడా ఈ వాల్మీకి రామాయణమును ఎక్కడా పరిచయం చేయడం లేదు. మన దేశమునే మన రామయణమునకు ఆదరణ లేదు. అయిననూ నేటికీ రామాయణ కథ అనేకులకు ఆదర్శమవుతున్నదీ అంటే అందలి ఆదర్శ గుణములే నని చెప్పవచ్చును.

గుర్తింపు కోసం:  అవును గుర్తింపు కోసము రామాయణమును కించ పరుచు వారూ ఉన్నారు. మనం పక్కింటి వాడినో, ఎదిరింటి వాడినో తిట్టామనుకోండి వాడికీ వీడికీ ఏదోగొడవ ఉన్నట్టుంది మనకెందుకులే అని ఎవరూపట్టించుకోరు. అదే ఏ ముఖ్య మంత్రినో, ప్రధాన మంత్రినో, సినీ తారనో తిడితే అభిమానులు, వ్యతిరేకులు అందరూ "ఎందుకు తిడుతున్నాడు? ఏమిటి కారణం?" అని మనల్ని గుర్తిస్తారు.(ఇటువంటి ధృక్పధంతోనే తల్లి సీతమ్మను నిందిస్తూ రాసిన చెత్త రాతలను ఈ మధ్యనే ఒక బ్లాగులో మనం గమనించాము.) టీవీ చానళ్లు మొదలైనవి ఇక ఊదరగొట్టేస్తాయి. అలా అందరి గుర్తింపు మనకి లభిస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. ఇక మనం ఏమి చేసినా అది ఒక వార్త అవుతుంది. కొన్ని రోజులు మనం తుమ్మినా దగ్గినా అది టీవీలో వచ్చేస్తుంది. కానీ అది ఎన్ని రోజులు. కొన్ని రోజులు మాత్రమే. విషయం పాత బడిన తరువాత మనం ఎవరో పక్కింటి వాడు కూడా పట్టించుకోడు. పైగా మనం అనవసరంగా ఆ రాజకీయ నాయకుడినో, సినిమా యాక్టర్ నో తిట్టామని తెలిసినా, మన ఐడెంటిటీ క్రైసిస్ బయట పడినా మనల్ని ఓ నీచమైన చూపుతో చూస్తారు తెలిసినవారందరూ.

మత వ్యతిరేకత ( లేదా ) నాస్తిక వాదన :  మత వ్యతిరేకత తోనో, లేదా దైవము మీద నమ్మకము లేకనో కూడా అనేకులు ఈ  విమర్శలను గుప్పిస్తుంటారు. సాధారణం గా ఇటువంటి వారు ఇందులోని మంచిని గుర్తించరు. ఒప్పుకోరు. కేవలం తమకు అసమజసమని, తప్పు అని అనిపించిన దానిని మాత్రమే పదే పదే  చర్చిస్తూ ఉంటారు. ఎవరైనా విరితో వాదన మనకెందుకులే అని మాటాడక ఊరుకుంటే తామే గెలిచినట్టు, తమదే సరిఅయిన మార్గ మన్నట్టు అహంకరిస్తారు. పోనీ అది సరికాదని ఖండిస్తే, నిరూపణలతో చూపిస్తే దానిని స్వీకరించక- తప్పు అని పించినా ఒప్పుకోక మరో వాదన తీసుకు వస్తారు. ఎందుకంటే తామే నిజమైన మార్గంలో ఉన్నామన్నది వీరి ఆలోచన. తమలో, తమ భావాలలో మార్పుకు సహజంగా వీరు సిద్ధంగా ఉండరు.

ఋషుల భావం గ్రహించలేక : మన పురాణములన్నీ ఋషుల చే ప్రసాదించ బడినవి. వారు అనేక సందర్భాలలో ఆయా సంఘటనలను పూర్తిగా వివరింపక మనకే వదిలి వేస్తారు.  ఉదాహరణకు : సత్యనారాయణ కథలో పేద బ్రాహ్మణుడు వ్రతం చేసి ధనవంతుడైపోతాడు, అలాగే కట్టెలమ్ముకునే వాడు సమస్త సంపత్తులూ పొంది సుఖిస్తాడు. అని వివరింప బడి ఉంటుంది కానీ ఎలా పొందారు? అన్నదానికి వివరణ ఉండదు. సరిగ్గా ఇటువంటి సందర్భాలు విమర్శచేయడానికి  అనువుగా తోస్తున్నాయి అనేకులకు. వ్రతం చేయగా నే ధనవంతుడైపోతాడా? లేదా పూజ చేయగానే పాపాలన్నీ తొలగి సమస్త సంపదలు అలాఎలా వస్తాయి. పూజ చేస్తే చదువు వస్తుంది. పెళ్లి అవుతుంది అంటారు. ఇవన్నీ ఎలా సాధ్యం? అంత అసంబద్ధంగా రచన ఎలా చేశారు ఋషులు? వారికి స్క్రిప్ట్ రైటింగ్ సరిగా రాదా? అని వాదిస్తారు అనేకులు. నమ్మకం లేని వారికి సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ ఇలాంటి వారికి ఒక ప్రశ్న. మనం తిండి ఎందుకు తింటాం? నన్ను తప్పుగా అనుకోకండి. నిజంగానే అడుగుతున్నాను మనం తిండి ఎందుకు తింటాం? బ్రతకడం కోసం ఔనా!? మరి తిండి తింటే ఎలా బ్రతుకుతాం? తింటే ఓపిక వస్తుంది. లేక పోతే నీరసం వచ్చి క్రుంగి, కృశించి  పోతాం. అంటే తిండి మనకు శక్తి ఇస్తున్నది. అంతవరకు బానే ఉంది. కానీ ఆశక్తి ఎలా వస్తున్నది? ఆహారం గ్లూకోజ్ గామారి రక్తంలో కలుస్తున్నది. అందువలన మనకు శక్తి కలుగుతున్నది. ఇది అందరూ నమ్మే సిద్ధాంతం. కానీ ఆ పనితీరు మనకు ఎలా తెలుసు? మనమేమైనా ఎవరి ప్రేగులైనా కోసి చూశామా? లేదు అలా పరిశోధించిన అనేక మంది శాస్త్రఙ్ఞులు చెప్పారు కనుక మన చిన్న నాటి నుండీ ఆపరిశోధనలను పుస్తకాలలో చదువుకున్నాము కనుక దానిని అందరమూ నమ్ముతాము. అయితే ఇది మన నమ్మకం మాత్రమే. మనకు అందరికీ ప్రత్యక్షంగా తెలియదు. కేవలం ఆహారం స్వీకరించడం తెలుస్తోంది - శక్తి రావడం తెలుస్తోంది ( పనులు చేయ గలుగుతున్నాం కనుక ) మధ్యలో జరిగే గ్లూకోజ్ గా మారడం - రక్తంలో కలవడం వంటివి మనకు కంటికి కనపడవు. అలాగే పూజ చేయడం తెలుస్తుంది. ఫలితం రావడం తెలుస్తుంది. కానీ మధ్యలో జరిగే తంతు మనకు కనపడక దానంతట అదే మనల్ని మన లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. నిజానికి మనకు పూజలు, దైవ ధ్యానము మొదలైన వాటివల్ల  కేవలం విల్ పవర్ మాత్రమే వస్తుంది. దానితో మనం కోరుకున్నది సాధించ గలము. ఇవన్నీ కొందరు చింతన ద్వారా గ్రహించి(పరిశోధించి) వాటి సారాన్ని మనకు అనేక కథలు గా రాశారు. పురాణాలలో అనేక కథలు వివరించడంలో దానిలో ప్రధానమైన విషయాలను విశదంగా వివరించి, కొన్నిటిని మన ఆలోచనకే వదిలేశారు మన ఋషులు. కానీ అవి అర్థంకాక, కలి మాయ చేత అనేక దూషణలు చేస్తుంటారు నాగరికులు.

ఇలా అనేక కారణములతో రామాయణాది పురాణేతిహాసములు విమర్శలకు గురి అవుతున్నవి. మరి వీటిని ఆపలేమా? కనీసం ఖండించ లేమా? దానికిమార్గాలు ఏమిటి? అనేకం ఉన్నాయి.

౧. పాఠశాల స్థాయి నుండీ మన రామాయణాన్ని ఇతర ఇతిహాస పురాణాలను ( మూలములను) పాఠ్యాంశాలలో కొంత వరకైనా పరిచయం చేయాలి.
౨.  ఇంట్లో పిల్లలకి ఈ మూల రామాయణమును, భారతమును వివరించి కథలుగా చెప్తూ ఉండాలి. అందువలన మధ్యలో చేర్చ బడినవి ఏమిటో తెలుస్తుంది.
౩. ఈ విధంగా తెలిసిన విషయాలను ఎవరైనా అఙ్ఞాన వశము చేత వ్యతిరేకిస్తుంటే, కించ పరుస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకొనక మన వాదనను వినిపించాలి. అది వారికొరకు కాదు. ఆ కువిమర్శలు నిజమనుకుని దానివైపు వేరొకరు ఆసక్తులవకుండా ఉండుటకొరకు. కనీసం చుట్టూ చేరిన జనులైనా నిజమేమిటో గ్రహిస్తారు. ఒక్కరికి అసలు విషయం చేరినా సంతోషమే కదా! మనం ఖండిచక పోతే సరిఅయిన అవగాహనలేని నేటి తరం పదే పదే వినిపించే భగవద్దూషణములే సరి అయిన మార్గమనుకునే అవకాశం చాలా ఉంది. కనుక మనకు తెలిసినంత మేర ఖండించాలి.

౪. కేవలం వాదన వినిపించడమే కాక, భారతీయ సాంప్రదాయము, పురాణేతిహాసములు నా ప్రాణములు. వాటిని కించ పరచడం నా దేశమును కించ పరచడమే. కనుక చట్ట పరమైన, న్యాయ పరమైన పోరాటమునకు కూడా నేను సిద్ధమే అని నిరూపించాలి.  అంటే ధర్మ యుద్ధానికి సిద్ధ పడాలి.

ఇలాంటి అనేక చర్యలు తీసుకుంటేగానీ మన వఙ్ఞ్మయమును మనం రక్షించుకొనలేము. ఇది మన అందరి ఆస్థి. దీనిని రక్షించుకొనుట మన కర్తవ్యం. ఇప్పటికైనా గళములు విప్పి మీ వాదన వినిపించండి. ధర్మ పోరాటం చేసే వారికి మీ సమ్మతిని, మేము మీకు తోడున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వండి. సరి అయిన దారిలో మీరు నడవడమే కాక నలుగురినీ నడిపించండి. చూస్తూ కూర్చుంటే మన అస్థిత్వాన్నే మనం కోల్పోవలసిన స్థితి వస్తుంది.

"ఆదిలోనే అబలను చంపుట అదేమి న్యాయం?" త్వరలో....

Tuesday, February 8, 2011

ధర్మ యుద్ధం మెదలు పెట్టండి

  భరతమాత బిడ్డలందరూ కోపంతో రగిలి పోయే శీర్షిక. అదీ తల్లి సీతమ్మని కించ పరుస్తూ. ఇది చూసి ఊరుకుంటూ కూర్చుంటే ఆ తల్లి బిడ్డలుగా మనం తలదించుకున్నట్టే. ఇలా ఎంతకాలం. నేను పుట్టిన భూమిలో నా తల్లిపైనే నిందలా? ఏమిటీ వైపరీత్యం. నిన్న బ్రాహ్మణ్యమే లేదన్నారు. అటుమొన్న పూజలెందుకు? అని ప్రశ్నించారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయమని మిన్నకున్నాము. కానీ నేడు మనందరికీ తల్లి అయిన సీతమ్మను...

ఇలా చూస్తూ కూర్చుంటే మాతల్లినీ మీతల్లినీ తిట్టినా పట్టని మనుషులమౌతాము.  ధర్మ యుద్ధం ఇకనైనా మొదలుపెట్టాలి. లేకుంటే ఈ బ్లాగులలో మరీ విపరీత ధోరణులు పెరిగిపొతున్నాయి. మన సహనం చేతకానితనం కాకూడదు. రాజు చేసే పని రాజు చేయాలి. అందరూ బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తే ఇలానే ఉంటుంది.

వెంటనే ఆబ్లాగు యజమానులు ఆశీర్షిక తొలగించి, తమ చర్యకు క్షమాపణ తెలియజేయాలి. న్యాయపరంగా మనమేమీ స్పందిచలేమా? ఇటువంటి వాటికి తగిన సమాధానం చేప్పలేమా?