24, ఆగస్టు 2012, శుక్రవారం

శ్రీ రామ నామ మహిమ

 



జపమనగా :

శ్లో// జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః/
తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః //

‘జ’ కారము జన్మ నాశనమును ( మోక్షము ను ), ‘ప’ కారము పాపనాశనమును సూచించును. అనగా పాపములను నాశనము చేసి, మరల జనన మరణములు లేకుండా మోక్షమొసంగు నట్టిది గనుకనే " జపం" అని చెప్పబడినది.

శ్లో// ప్రణవో థనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే/
అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్//

భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు. ఆత్మయైన సాధకుడే బాణము. బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము.  సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని,  నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురిచూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మమునందు జేరి తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.

జపానికి ఇంతటి శక్తి ఉంటే!, ఇక " శ్రీ రామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!?

శ్రీ రామ నామ మహిమ :

శ్లో// గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః
వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః//

 తా: గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటికంటెనూ అధిక ఫలము ఈ రామ నామ జపము వలన కలుగు తుంది. 

రామ నామము జపించుచుండుట వలన గాని, ఈ రామ నామమునే మరణాసన్నులైన వారి కుడి చవిలో ఉపదేశించుట వలన గానీ, ఎవరయినను మోక్షము బొందెదరని శ్రీరాము శివునకు ఉపదేశించెనట.

  "ర" అగ్ని బీజం - దహింప జేయునది,
  " ఆ" వాయు బీజం - సర్వగతము, ఆకర్షకము,
"మ" ఆకాశ బీజం - శతృ మోహన కరము

  ఇటువంటి అగ్ని బీజ, వాయుబీజ, ఆకాశ బీజ సమ్మిళితమైన " శ్రీ రామ" నామ మహిమ ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.

 శ్లో// చిద్వాచకో ర కారస్స్యాత్ సద్వాచ్యో2కార ఉద్యతే/
మకారానంద వాచస్స్యాత్ సచ్చిదానంద మవ్యయమ్//
  "ర" కారము చిత్తు,  "ఆ" కారము సత్తు,  "మ" కారము ఆనందము. వీటి సంయోగముచే నాశరహితమైన "సచ్చిదానంద రూపమే శ్రీరామ" నామము.
అలాగే "ర" కారము వైరాగ్యమునకు హేతువు, "ఆ" కారము ఙ్ఞాన కారణము, "మ" కారము భక్తికి కారణము కనుక నిత్యము రామనామమను జపించు వారలకు భక్తి, ఙ్ఞాన, వైరాగ్యములు కలుగును.

శ్లో// "తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం//"
‘రామ రామ ’ అని క్షణ క్షణము జపించుచుండట వలన యమ దూతలు దరికి జేరుటకు కూడా భయపడి దూరముగా పారిపోవుదురు.

శ్లో// అఙ్ఞానాదధ వాఙ్ఞానా దుత్తమ శ్లోక నామయత్/
సంకీర్తిత మఘం పుంసోదహేత్యేవ యథానలః //
ప్రజ్వరిల్లెడి అగ్ని కట్టెలను కాల్చు చందమున, భగవన్నామ శక్తి తెలిసి కాని, తెలియక కాని ఏవిధంగా చేసినా మానవుల యొక్క పాపములను దహించి వేయును. 

 కనుక అటువంటి ‘రామ’ నామజపాన్ని మనము చేయుట వలన జన్మజన్మాంతరములలో చేసిన పాపములన్నీ నాశనమొంది ఇహమున సమస్త సంపదలూ పొందటమే కాక, పరమున మోక్ష ప్రాప్తిని పొందుదురు. 

రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది...

త్రేతాయుగంలోనే శ్రీ రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ. ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆనొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది!? అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

 రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలం గా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు, ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితోఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా!? నేనే ఇంత బాధపడుతున్నాను’ అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత  రామ నామ గానం చేస్తూ.. ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.
కనుక ఇటువంటి రామనామన్ని మనం చేస్తూ నలుగురి చేతా చేయిస్తూ పునీతులమౌదాం!


8 కామెంట్‌లు:

  1. బాగుంది. బాగుంది. చాలా బాగా వ్రాసారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. is it really happened in tretayugam ? if it is so this is very beautiful to listen such a story . Thq u

      తొలగించండి
    2. ఇది కల్పిత కథ అనుకుంటాను. కానీ చాలా అద్భుతంగా ఉన్నది. :)

      తొలగించండి
  2. ఈ కథను బట్టి, సర్వకాల సర్వావస్థలయందు భగవన్నామ స్మరణ చేయకూడదని, దానితో దెబ్బలు పడే అవకాశాలున్నాయని మనకు అర్థమవుతోంది. !! :-/

    రిప్లయితొలగించండి